విద్యార్థులపై లాఠీచార్జీ: ఎస్కేయూలో ఉద్రిక్తత
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. ఈ ఘర్షణలో మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి సింగనమల పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసు స్టేషన్ ఎదుట యూనివర్శిటీ అధికారులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర నినాదంతో గత నాలుగు రోజులుగా ఎస్కేయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతపురంలో ఆమరణ దీక్ష ప్రారంభించిన తెలుగుదేశం శాసనసభ్యులను పరామర్శించేందుకు విద్యార్థి నాయకులు సోమవారం విశ్వవిద్యాలయం నుంచి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మంగళవారం ఎట్టి పరిస్థితిలోనూ అక్కడికి వెళ్లాలని విద్యార్థి నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే మృతి చెందిన రాముడు అనే వ్యక్తి మృతదేహంతో ర్యాలీ చేయడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సింగనమల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందిని బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలించారు.