రోశయ్య సిఎం పీఠం కదిలింది: కె చంద్రశేఖర రావు
తెలంగాణ సాధిస్తామని ఈ సమావేశం విశ్వాసం కలుగజేస్తుందని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసననసభ్యుడు కె. జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ సాధించే విషయంలో అపోహలు, అనుమానాలు వద్దని ఆయన ప్రజలను కోరారు. ఆందోళనలు ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పారని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ అన్నారు. కేంద్రం కళ్లు తెరవాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఇంత ఐక్యత ఎన్నడూ చూడలేదని, ఈ ఐక్యతను చూసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తామనే నమ్మకం కుదిరిందని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధమని ఆయన చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కాలయాపన చేస్తోందని, తెలంగాణకు కట్టుబడి ఉన్నప్పుడు వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించడం అవసరమని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుదడు చెన్నమనేని రాజేశ్వరరావు అన్నారు. రాష్ట్రాల ఏర్పాటుకు శాసనసభ తీర్మానం అవసరం లేదని ఆయన చెప్పారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ బలపరుస్తుందని బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు చెప్పారు. తెలంగాణ విషయంలో నెహ్రూ చెప్పిందే తాము అడుగుతున్నామని కాంగ్రెసు సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఎప్పుడిస్తారో చెప్పాలని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. సియాసత్ ఎడిటర్ జహీద్ అలీఖాన్, ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ మాదిగ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. ప్రజా సంఘాల నాయకులు తెలంగాణకు సంబంధించి తీర్మానాలు ప్రతిపాదించారు.
ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల దాడిని కె. చంద్రశేఖరావు ఖండించారు. ఉస్మానియాకు వెళ్తామని, చావో రేవో తేల్చుకుంటామని ఆయన అన్నారు. ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని జెఎసి ఖండించింది. తెలంగాణలో ప్రజాస్వామిక పద్ధతిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో సెక్షన్ 144ను వెంటనే ఎత్తేయాలని కూడా డిమాండ్ చేసింది.