కూలిన భవనం: 8కి చేరిన మృతులు
హైదరాబాదులోని నారాయణగుడాలోని ఫ్లైఓవర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం శుక్రవారం కూలింది. శిథిలాల కింద పలువురు కార్మికులు ఉన్నట్లు భావిస్తున్నారు. శిథిలాల కిందికి ఆక్సిజన్ ను పంపించే ఏర్పాట్లు చేశారు. నాలుగు అంతస్థుల భవనం అది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. మంత్రి ముఖేష్ గౌడ్, శాసనసభ్యుడు కిషన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మేయర్ కార్తికా రెడ్డి కూడా వచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గ్యాస్ కట్టర్లతో ఇనుప రాడ్లను కోసి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
పక్కనే ఉన్న బ్రిలియంట్ స్కూలు కూలిపోయిందనే వార్తలు రావడంతో పెద్ద యెత్తున తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ప్రజలు కూడా పెద్ద యెత్తున చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పక్కనే ఉన్న భవనం కూలడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను జాగ్రత్తగా బయటకు పంపించారు. పాఠశాల భవనానికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు. పిల్లలంతా సురక్షితంగానే ఉన్నారు. శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.