ఉస్మానియాలో మళ్ళీ పోలీసుల టెర్రర్, ఉద్రిక్తత

ఈ నెల 14, 15 తేదీల్లో ఉస్మానియా విద్యార్థులు తమపై దాడికి దిగారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా టాస్క్ఫోర్స్ పోలీసులు క్యాంపస్ కు వచ్చారు. భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించేందుకు ఫ్యాకల్టీ క్లబ్ భవనంపైన ఐకాస నేతలు సమావేశమయ్యారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. కొందరు పైన, మరికొందరు విద్యార్థులు ఆవరణలో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా టాస్ఫోర్స్ పోలీసులు బయట మాట్లాడుకుంటున్న వారిపై దాడి చేసి బలవంతంగా వాహనాలలో తరలించారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి రమేష్, శరత్ తీవ్రంగా గాయపడ్డారు. ఐకాస ప్రతినిధులను క్యాంపస్ లో అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. అయితే పోలీసులే రమేష్, శరత్ లను భవనంపై నుంచి కిందకి తోసేశారంటూ ఐకాస ప్రతినిధులు ఆరోపించారు. రమేష్ తలకు తీవ్రగాయాలు కాగా, శరత్ చేయి విరిగింది. పోలీసుల చర్యలకు కోపోద్రిక్తులైన విద్యార్థులు శరత్, రమేష్ లను తోడ్కొని వందల సంఖ్యలో అర్ధనగ్నంగా పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వందలాది విద్యార్థులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విద్యార్థుల నిరసనకు మద్దతుగా న్యాయవాదులు, బీడీఎల్ ఉద్యోగులు, జర్నలిస్టులు ఆందోళనలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications