కెవిపినే అంటారా?: సీమాంధ్ర యువ ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రోశయ్య వెనక తామంతా ఉన్నామని, వైయస్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న రోశయ్యకు తాము పూర్తి మద్దతుగా నిలుస్తామని వారు చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలను తాము సాగనివ్వబోమని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ అల్లర్ల వెనక సీమాంధ్ర నాయకుల కుట్ర ఉందనే తెరాస ఆరోపణపై కూడా వారు విరుచుకుపడ్డారు. చౌకబారు ఆరోపణలతో చౌకబారు రాజకీయాలు చేయవద్దని వారు సలహా ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా, వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము సహించబోమని వారు చెప్పారు.
కాంగ్రెసులో స్వేచ్ఛ ఎక్కువైపోయిందని, మధుయాష్కీ కెవిపిపై విమర్శలు చేస్తే, మరో శాసనసభ్యుడు పార్టీలోనివారి కుట్ర అల్లర్ల వెనక ఉందని అన్నారని, ఇటువంటి ప్రకటనలు సరైనవి కావని వారన్నారు. దీనిపై తాము కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.