IRCTC New Website: ఇక చిటికెలో టికెట్ల బుకింగ్! లైవ్లోకి కొత్త బీటా వెర్షన్
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిరోజూ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు పడే ఇబ్బందులకు చెక్ పెడుతూ.. సరికొత్త హంగులతో డిజైన్ చేసిన వెబ్సైట్ 'బీటా' (ట్రైల్) వెర్షన్ను లైవ్లోకి తెచ్చింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా నడిచే ఈ సైట్ను వాడి చూసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని రైల్వే శాఖ తెలిపింది.
జూలై 15 నాటికి కొత్త వెబ్సైట్ను తీసుకొస్తామని గతంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన నేపథ్యంలో.. అందులో భాగంగానే తొలి దశలో ఈ ట్రైల్ వెర్షన్ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కూడా రానుంది.

కొత్త సైట్లో స్పెషాలిటీ ఏంటంటే?
సాధారణంగా పాత వెబ్సైట్లో టికెట్ బుక్ చేసేటప్పుడు రకరకాల యాడ్స్, పాప్-అప్లు, పదే పదే వచ్చే క్యాప్చాలు ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. కొత్త వెబ్సైట్లో ఈ చికాకులన్నింటికీ స్వస్తి పలికారు. వెబ్సైట్ లుక్ను చాలా సింపుల్గా మార్చేశారు. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి గందరగోళం లేకుండా చాలా సులభంగా తమకు కావాల్సిన వివరాలను వెతుక్కోవచ్చు. ముఖ్యంగా అన్ని క్లాసుల (స్లీపర్, ఏసీ) సీట్ల లభ్యత వివరాలను పదే పదే పేజీలు మార్చాల్సిన అవసరం లేకుండా ఒకే స్క్రీన్పై చూసుకునే సదుపాయాన్ని కల్పించారు.
తత్కాల్ బుకింగ్స్ ఇక మరింత స్పీడ్!
రైలు ప్రయాణాల్లో తత్కాల్ టికెట్లు దొరకడం అనేది సెకన్లతో కూడిన పని. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ బుకింగ్ ప్రాసెస్ను చాలా వేగవంతం చేసింది. గతంలో లాగా ఎక్కువ స్టెప్స్ లేకుండా, తక్కువ క్లిక్లతోనే టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా మార్పులు చేశారు. దీనితో పాటు, తరచూ ప్రయాణించే వారి కోసం 'ప్యాసింజర్ డిటైల్స్' సేవ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. దీనివల్ల ప్రతిసారీ ప్రయాణికుల పేర్లు, వయసు వంటి వివరాలను మాటిమాటికీ టైప్ చేయాల్సిన పని ఉండదు. సేవ్ చేసిన లిస్ట్ నుంచి ఒక క్లిక్తో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రయాణికులకు ఎంతగానో కలిసి రానుంది.
అభిప్రాయాలు చెబితే మరిన్ని మార్పులు
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త సైట్ లింక్ను ఐఆర్సీటీసీ అధికారిక హోమ్పేజీలోనే పైన అందించారు. లేదా నేరుగా లింక్ ద్వారా కూడా ఓపెన్ చేయవచ్చు. ఈ ట్రైల్ రన్లో ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలు, వారు ఇచ్చే సలహాల ఆధారంగా మరిన్ని మార్పులు చేసి, ఆ తర్వాత దీనిని శాశ్వత వెబ్సైట్గా మార్చనున్నారు.
ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 14.5 లక్షల రైలు టికెట్లు ఐఆర్సీటీసీ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ తోడైతే భవిష్యత్తులో సర్వర్ డౌన్ సమస్యలు తగ్గి, బుకింగ్ అనుభవం మరింత సాఫీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications