నూజివీడు మామిడి పళ్ళ 'రథం' కదిలింది!
తొలిరోజు 42 వ్యాగన్లతో కూడిన ప్రత్యేక గూడ్సు రైలు (రేక్) ఇక్కడి నుంచి మామిడితో బయలుదేరింది. దక్షిణ మధ్యరైల్వే విజయవాడ డివిజన్ అసిస్టెంట్ డీఆర్ఎం బీ జయరాజు ఎగుమతులను పరిశీలించారు. ఈ ఏడాది మామిడి దిగుబడులు ఆశాజనకంగా ఉండటం వల్ల ఆదాయం మించే అవకాశముందని భావిస్తున్నామన్నారు. 40 నుంచి 45 రేక్లతో మామిడి రవాణాకు ఇండెంట్ రావచ్చన్నారు. జూన్ మొదటివారం వరకు నూజివీడు స్టేషన్ నుంచి మామిడి ఎగుమతులు రైళ్లలో జరుగుతాయన్నారు. ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోన్న స్టేషన్లో కార్మికులకు కనీసం సదుపాయాలు కల్పించకపోవటంపై కార్మికసంఘాల నేతలు నిరసన వ్యక్తంచేశారు.
దీనిపై డీఎర్ఎం స్పందిస్తూ కార్మికులకు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎగుమతి అవుతోన్న అట్టపెట్టెల్లోని మామిడి కాయలను ఆయన పరిశీలించారు. అసిస్టెంట్ డీఆర్ఎం వెంట స్టేషన్ సూపరింటెండెంట్ కె.జగదీశ్వరబాబు, విజయవాడ రైల్వే డివిజన్ రవాణా ఇన్స్పెక్టర్ రామ్మోహన్, వర్క్స్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఉన్నారు. అంతకుముందు కార్మికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి లారీల్లో వచ్చిన మామిడి అట్టపెట్టెలను వ్యాగన్లలోకి ఎగుమతిచేశారు. కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు చలమలశెట్టి రమేష్బాబు ఎగుమతులను ప్రారంభించారు.