మంత్రి పదవికి శశి థరూర్ రాజీనామా
కేంద్ర మంత్రి శరద్ పవార్, ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీలు ఐసీసీ త్రైమాసిక సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం దుబాయికి వచ్చారు. ఐపీఎల్ కోచీ ఫ్రాంచైజీ కొత్త ఛైర్మన్ హర్షద్ మెహతా లలిత్ మోడీని కలిశారు. ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. వివాదానికి మూలబిందువైన సునంద పుష్కర్ ఐపీఎల్ కోచీ ఫ్రాంచైజీలో తన ఉచిత వాటాను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దాంతో ఐపీఎల్ బాస్ లలిత్ మోడీ రాజీకి వచ్చారు. తనకు కోచీ ఫ్రాంచైజీతో గానీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్తో గానీ ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ప్రకటించారు. ఈ వివాదం త్వరలోనే సమసిపోతుందని చెప్పారు. అయినా శశి థరూర్ రాజీనామా చేయక తప్పలేదు.
ఆదివారం సాయంత్రం సోనియా గాంధీ స్వయంగాప్రధాని నివాసానికి వచ్చి మన్మోహన్తో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ వివాదం మొదలయ్యాక ఇద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగానే థరూర్ ఇబ్బందికరంగా తయారయ్యారనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు సమాచారం. అనంతరం సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ కోర్ కమిటీ అక్కడే భేటీ అయ్యింది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఆంటొనీ, హోంమంత్రి చిదంబరం, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్ పాల్గొన్నారు. థరూర్ తో రాజీనామా చేయించాలని నిర్ణయానికి వచ్చారు. ప్రధాని మన్మోహన్ నుంచి పిలుపు అందడంతో శశి థరూర్ ప్రైవేటు కారులో ప్రధాని నివాసానికి వచ్చారు. ఇద్దరూ గంటసేపు సమావేశం అయ్యారు. థరూర్ రాజీనామా లేఖను అందించి, ప్రధాని నివాసం నుంచి బయటపడ్డారు. అనంతరం ఆయన రాజీనామాను ప్రధాని ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదానికి పంపారు.