తెలంగాణపై వివక్షను చెప్పాం: సింగిడి
ఇరు ప్రాంతాల ప్రజలు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ, భాషలో వివక్ష ఎలా ఉంటుందని జస్టిస్ శ్రీకృష్ణ అడిగారు. భాష, యాస, పదాల్లో తేడాలున్నాయని, తెలంగాణ భాషపై వివక్ష ఎలా జరిగిందో ఆధారాలతో సహా చెప్పామని వారన్నారు. తెలంగాణ రచయితలకు సంబంధించిన అంశాలు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరినా పట్టించుకోలేదని చెప్పినట్లు సింగడి ప్రతినిదులు అన్నారు. ఎంఐఎం మినహా తెలంగాణలోని 15 శాతం ముస్లింలు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. తెలంగాణ ముస్లింలకు ఎంఐఎం ప్రతినిధి కాదని చెప్పామని అన్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి చేతుల్లో ఉన్నందున సినిమాల్లో విలన్లకు, జోకర్లకు తెలంగాణ భాష అంటగడుతూ రౌడీల భాషగా చిత్రీకరిస్తున్నారని తెలియజేశామని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో అట్లతద్దె, అల్లూరి సీతారామరాజు కథలు చేర్చారని, కానీ బతుకమ్మ, కొమురం భీమ్ గురించి మాత్రం ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు.