చంద్రబాబు నీచాతినీచుడు: గాలి
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాలి జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి విడివిడిగా విరుచుకుపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి ఓ గంజాయి మొక్క అని, ఆ గంజాయి మొక్కను ఏరివేసే పని చంద్రబాబు చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. బ్రాహ్మణి స్టీల్ నిర్మాణానికి ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉందని, దాన్ని పూర్తి చేయకపోతే గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపుతామని ఆయన అన్నారు. వైయస్ సహకారంతో గాలి జనార్దన్ రెడ్డి అనంతపురం ప్రజలను దోచుకున్నారని, దాంట్లో కొద్ది మొత్తాన్ని సామూహిక వివాహాలకు ఖర్చు చేసి పాపాలు కడుక్కుందామని అనుకుంటున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబుపై గాలి జనార్దన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ప్రజలే సమాధానం చెప్తారని ఆయన అన్నారు. గాలిపై చర్యలు తీసుకోవడానికి రోశయ్య నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రోశయ్య, ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి అండదండలతో గాలి జనార్దన్ రెడ్డి తన అక్రమాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.