జగన్ కు అన్ని ఆస్తులెక్కడివి: బాబు
కాంగ్రెసు పాలనలో కొంత మంది కోటీశ్వర్లయ్యారని, రాష్ట్రం దివాళా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక స్థితికి ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, సంక్షేమ పథకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తారో లేదో స్పష్టం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 2009లో ఇచ్చిన రెండు హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని ఆయన అన్నారు. రైతులకు 9 గంటలు విద్యుత్ ఇస్తామని, సబ్సిడీ బియ్యం కోటా పెంచుతామని కాంగ్రెసు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని ఆయన అన్నారు.
ఆరేళ్ల నుంచి ప్రభుత్వం బిసిలకు ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మహానాడు యధాతథంగా జరుగుతుందని ఆయన చెప్పారు. తుఫాను తాకిడి ప్రాంతాలలకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వైద్య బృందాలను పంపినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశామని ఆయన చెప్పారు.