క్యాష్ స్కామ్: సాక్షి దాడితో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి
ఏడు కోట్ల రూపాయల వ్యవహారంపై వార్తాకథనాలు వస్తుండడంతో చంద్రబాబు చంద్రగిరి తెలుగుదేశం నాయకులకు ఫోన్ల మీద ఫోన్లు చేసినట్లు సమాచారం. అదే విధంగా పేరం హరిబాబుకు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు తనది కాదని, డబ్బు రవాణాకు వాడిన వాహనం మాత్రం తనదేనని పేరం హరిబాబు జిల్లా ఎస్పీకి చెప్పారు. ఆయన గురువారంనాడు జిల్లా ఎస్పీని కలిసి వివరణ ఇచ్చారు. అయితే, ఆ డబ్బు హరిబాబుదేనని వర్ల రామయ్య చెప్పడం మరింత ఇబ్బందికరంగా మారింది.
కాగా, డబ్బు రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు గురువారంనాడు కోర్టు ముందు హాజరు పరిచారు. ఆ ఐదుగురిలో హరిబాబు తండ్రి రామకృష్ణయ్య కూడా ఉన్నారు. ఆ డబ్బు ఓ చిట్ ఫండ్ కంపెనీదని, కర్నాటకలోని బ్యాంక్ నుంచి దాన్ని డ్రా చేసుకుని వస్తున్నామని నిందితులు చెప్పినట్లు సమాచారం. అంతకు మించి నిందితులు పోలీసులకు ఏం చెప్పారనే విషయాలు వెల్లడి కావడం లేదు. ఆ డబ్బు ఇనుప ఖనిజానికి సంబంధించిందనే వార్తలు కూడా వస్తున్నాయి. పేరం హరిబాబు కొందరు కాంగ్రెసు నాయకులతో కలిసి వ్యాపారం సాగిస్తున్నారని, ఆ వ్యాపారానికి సంబంధించిందే ఆ డబ్బు అనే ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెసు నాయకులు హరిబాబును ఇరికించారనే దిశగా కూడా ఆలోచన సాగుతోంది.