చిరంజీవిని సలహాదారులు తప్పుదోవ పట్టించారా?
తమ పార్టీతో పొత్తు వల్ల కలిగే లాభం గురించి గానీ, తమ పార్టీ గత ఎన్నికల్లో నిర్వర్తించిన పాత్రను గానీ చిరంజీవి సోనియా ముందు సరిగా పెట్టలేకపోయారని అంటున్నారు. సోనియాతో భేటీకి ముందు చిరంజీవికి ముందస్తు కసరత్తు తగినట్లుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యసభలో కాంగ్రెసుకు మద్దతివ్వడానికి మాత్రమే అయితే చిరంజీవి ఢిల్లీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని, సోనియాతో ఫోన్ లో మాట్లాడితే తన స్థాయిని పెంచుకునే విధంగా ఉండేదని అంటన్నారు. సలహాదారులు చిరంజీవిని తప్పు దోవ పట్టించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. చిరంజీవితో పొత్తు కుదిర్చామని కాంగ్రెసు నాయకుల వద్ద క్రెడిట్ కొట్టేయాలని చూసినవారే చిరంజీవికి సలహాదారులుగా వ్యవహరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, సోనియా గాంధీకి, చిరంజీవికి మధ్య సాగిన చర్చల సారాంశం ఇప్పటి వరకు బయటకు రాలేదు. రాజ్యసభ ఎన్నికల్లో పొత్తు ఒక సాకు మాత్రమేనని, దానికి మించి మాట్లాడడానికే సోనియా చిరంజీవిని ఆహ్వానించారని, అది భవిష్యత్తులో ఆచరణ రూపంలో బయటకు వస్తుందని చాలా మంది భావిస్తున్నారు.