వైయస్ జగన్ తో రాజీకి సందీప్ దీక్షిత్ మధ్యవర్తిత్వం కట్టుకథేనా?
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకు ఏ పాత్రా లేదని కాంగ్రెసు పార్టీ సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్ విప్ హాదాలో ఎంపీలను సమన్వయపరచడం తన బాధ్యతని, ఈ విషయమై పార్టీ ఎంపీలందరితో మాట్లాడుతుంటానని తెలిపారు. అదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి మాట్లాడానని చెప్పారు. అధిష్ఠానం-జగన్ మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన మంగళవారం సాయంత్రం ఖండించారు. తాను రాయబారం నడపట్లేదని, అలాంటి బాధ్యతలేవీ కూడా తనకు అప్పగించలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
జగన్కు ఏమైనా చెప్పదలచుకున్నారా అని అడిగినప్పుడు - ఆయనే కాదు, ఏ కాంగ్రెసు కార్యకర్త అయినా పార్టీ పట్ల విశ్వాసంగా ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. పార్టీ అమ్మలాంటిదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా రాజకీయాల్లో జగన్ ప్రస్తుతం ఒక చర్చనీయాంశం కాబట్టి ఆయనతో తాను రాజకీయాలు మాట్లాడానని అనుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ తాను జోక్యం చేసుకోవడానికీ ఏమీ లేదన్నారు. పార్లమెంటు సెంట్రల్హాల్లో పిచ్చాపాటీగా మాట్లాడుకొనే మాటలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు.