వైయస్ జగన్ తప్పుడు యుద్ధం చేస్తున్నారా?
వైయస్ జగన్ ఫిర్యాదును బట్టి ఆయన పరిణామాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మేరకే రాష్ట్రంలోని పార్టీ నాయకులు జగన్ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే అలా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ వైయస్ జగన్ ను సాధ్యమైనంత బలహీనం చేసే పనికి ఒడిగట్టారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కాస్తా మెతగ్గా వ్యవహరిస్తుండడం వల్ల, కెవిపి రామచందర్ రావు ఎత్తుగడల వల్ల జగన్ కు ఎక్కువ సమయం లభించినట్లు కూడా భావిస్తున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు విమర్శలు చేసినా, రాయలసీమ శాసనసభ్యులు ఆరోపణలు చేసినా అది అధిష్టానం ప్రమేయంతోనే జరుగుతుందనే విషయాన్ని జగన్ పసిగట్టకపోవడం మొత్తం వ్యవహారంలో పెద్ద లోపం. పైగా, అధిష్టానానికి జగన్ ఏ మాత్రం విధేయతను ప్రదర్సించడం లేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి నడిపిన అసమ్మతి రాజకీయాలను ప్రస్తుతం తాను నడుపుతున్నట్లు భావిస్తే జగన్ పప్పులో కాలేసినట్లేనని భావిస్తున్నారు.