హైకమాండ్ గరం: వచ్చే నెల 4న వైయస్ జగన్ కు షోకాజ్?

ఓదార్పు యాత్ర వల్ల పార్టీలో అయోమయం ఏర్పడిందని, వైఎస్ మరణించిన నాటి నుంచే జగన్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ పార్టీ నుంచి వెళ్లిపోకుండా, పార్టీలోనే ఉంటూ పార్టీకి ఇబ్బందులు కలగిస్తున్నారని, అందువల్ల అతన్ని తప్పించడమే మంచిదని ఓ సీనియర్ నాయకుడు సోనియాకు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. జగన్ పై చర్య తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో అస్పష్టత తొలగిపోతుందని, ప్రభుత్వపరంగా పార్టీ పరంగా చేయాల్సిన పనులు సాఫీగా జరిగిపోతాయని అంటున్నారు. నాలుగేళ్ల పాటు జగన్ నిలదొక్కుకోవడం కష్టమని చెబుతున్నారు.శాసనసభ్యులు కూడా జగన్ వైపు వెళ్లేందుకు వెనకాడుతారని అంటున్నారు.
వైయస్ మరణించి ఏడాది గడవక ముందే జగన్ పై చర్య తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందువల్ల ఏడాది పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటే మంచిదని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభించిన వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. తమ భేటీల్లో జగన్ ఓదార్పు యాత్రపై చర్చ జరగలేదని డిఎస్ చెప్పారు. అయితే ప్రధాన చర్చ అదే జరిగిందని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications