తెరాస అధినేత కెసిఆర్ కు సిగ్గు లేదు: నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ సాధించిన తర్వాత తెలుగుదేశం జాతీయ పార్టీగా ఉద్బవిస్తుందన్నారు. తమపై, తమ ఆధినేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కెసిఆర్ కు సిగ్గు లేదని, కాని మేము ఆయనలా మాట్లాడాలంటే సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఉద్యమ పార్టీ అంటే ఎలా ఉండాలి. రాజకీయాలతో ముడి పెట్టుకోకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అనుకున్నది సాధించడానికి అందరినీ కలుపుకొని పోవాలన్న విషయం తెలుసుకోవాలన్నారు. తెరాసకు క్యాడర్ కూడా సరిగా లేదు. కాబట్టి మంచి క్యాడర్ ఉన్న, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి కలిగిన తెలుగు దేశం పార్టీని కలుపుకు పోవాలనే ఇంగితం లేదా అని ప్రశ్నించారు.
కెసిఆర్ కు తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో లగడపాటిని మెచ్చుకోవటం, సీమాంధ్ర సీఈవోలతో సమావేశం కావడం, ఇక్కడ పుట్టిన వాళ్లందరిని తెలంగాణ వాళ్లే అనడాన్నిబట్టి తెలుస్తుందన్నారు. తెలుగు దేశాన్ని ఆంధ్రా వాళ్ల పార్టీ అన్న కెసిఆర్ కు అంతకుముందు అదే పార్టీ రాజకీయ బిక్ష పెట్టిందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కెసిఆర్ తన బాధ్యతను తెలుసుకొని నడుచుకోవాలన్నారు. తెలుగు దేశం ఆంధ్రవాళ్లకు వ్యతిరేకం కాదని, తెలంగాణకోసం మాత్రం పోరాడుతామన్నారు.
కెసిఅర్ తెరాసను కుటుంబాన్ని రాజకీయంలో నిలబెట్టడానికి, అక్రమ సంపాదన కోసం మాత్రమే స్థాపించాడనే ఆరోపణలు వస్తున్నాయని వాటిని కాదని రుజువు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నాడన్నారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం అంటూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మంత్రివర్గంలో చేరి తెలంగాణ వాదాన్ని మరుగుపర్చి, లాభార్జనలో పడ్డాడన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పి మంత్రి పదవుల పేరుతో అందలం ఎక్కడం ఎంత వరకు సమంజసం. కెసిఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. అధీకారంలో ఉన్న వారితో పోరాడకుండా తెలంగాణ కోసం పనిచేస్తున్న మాపై పోరాటం చేయటం వెనుక ఎవరి హస్తం ఉందని, ఇది కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమేనన్నారు. కెసిఆర్ బలహీనతలు అందరికీ తెలుసునని వాటిని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని నాగం వ్యాఖ్యానించారు.
తెలుగు దేశం ఇప్పటికే తెలంగాణ కోసం పోరాడుతుందని, అయితే కెసిఆర్ లా నాటకాలు అడకుండా చిత్తశుద్ధితో తమ పోరాటం ఉంటుందన్నారు. శ్రీకృష్ణ కమిటి ఫలితం డిసెంబర్ 31న వస్తుందని అప్పుటు తెలంగాణ తెలుగుదేశం శక్తి అందరికీ కనిపిస్తుందన్నారు.