ప్రధాని పదవిపై కన్నేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అవుతుందని తెలుగుదేశం నాయకులంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని చంద్రబాబు కూడా ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే పనిలో మరోసారి ఆయన గట్టిగా కృషి పెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవియంలపై ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్నారు. ఈ అవకాశాన్ని ఆయన వామపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించేందుకు వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, గుంటూరు, తిరుపతి, విశాఖల్లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని ముద్దుకృష్ణమ నాయుడు కోరారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలను హైదరాబాదులో నిర్వహించాలని, హైదరాబాదును దేశం రెండో రాజధానిగా చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ బెంగళూర్ లోని తన వైట్ హౌస్ లో లక్ష కోట్ల రూపాయలు దాచారని, ఆ గుట్టును రట్టు చేస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.