బిఇడి, పారామెడికల్, ఫ్రీజోన్ అంశాలతో అట్టుడుకుతున్న హైదరాబాద్
అటు బిఇడి విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తుండగా ఇటు కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది సైతం కోఠిలోని హెల్తు డైరెక్టర్ కార్యాలయంపైకి ఎక్కి తమను క్రమబద్దీకరించాలని, అలాగే తమ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానం నాగేందర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని, మేము భవనం మీదనుండి దిగమని వారు అంటున్నారు. మంత్రి హామీ ఇవ్వకపోతే పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమని వారు పెట్రోలు డబ్బాలతో హెచ్చరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పని చేస్తున్నప్పటికీ తమను క్రమబద్దీకరించకుంటే ఊరుకునేది లేదంటున్నారు. మరో 30 మంది ఆందోళనకారులు హెల్తు కార్యాలయంలోకి వెళ్లి లోపల గడియ వేసుకున్నారు. ఓ ఉద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు.
కాగా ఫ్రీజోన్ అంశం విషయం తేలే వరకు ఎస్ఐ రాత పరీక్షను నిర్వహించవద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్ఐ అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. గురువారం వారి ఏబివిపి రాజ్ భవనాన్ని రెండుసార్లు ముట్టడించి ఉద్యామాన్ని ఉధృతం చేసింది. నేడు అనగా గురువారం నుండి ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి విద్యార్థులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.