ఈనాడు రామోజీరావును రక్షించడానికే: గోనె ప్రకాశరావు
సాక్షిలో వచ్చిన కథనాలకు జగన్ కు సంబంధం లేదన్నారు. ఆయన పత్రికలో వచ్చిన అంశాలన్నీ ఆయనకు తెలియాలని లేదని చెప్పారు. జగన్ కాంగ్రెసు పార్టీకి సంబంధించి పార్లమెంటు సభ్యుడు. సోనియాగాంధీ ఆయనను కారణాలు అడుగుతారు. వీరికేమిటని ప్రశ్నించారు. అధిష్టానం చూసుకుంటుంది కదా అని చెప్పారు. సాక్షిలో వచ్చిన కథనాన్ని నేనుకూడా ఖండిస్తున్నానని, అయితే దానికి దాడులు సరికావన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగిన వారు ఇప్పుడు ఆయనపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారన్నారు.
వైఎస్ మరణించగానే జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలని అందరూ సంతకాలు చేశారని గుర్తు చేశారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చేయకుంటే రాజకీయాల్లో ఉంటానో లేదో అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీలో ఉండనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి మంత్రులు, ఆత్మహత్య చేసుకుంటానని ఘనపురం శాసనసభ్యుడు రాజయ్య అన్నారని ఇప్పుడు వాళ్లు జగన్ కే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు.
కాంగ్రెసు నాయకులు కొంతమంది అక్రమంగా పేదల భూములు ఆక్రమించుకున్న ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుని విమర్శించాలన్నారు. కేశవరావు, విహెచ్ లు చేస్తున్న పనులు ఈనాడును రక్షించడానికి చేస్తున్నట్టున్నాయన్నారు. పదివేల మంది ఉద్యోగులకు రామోజీరావు బోనస్ లు ఇవ్వక పోవటంతో రోడ్డెక్కారని వారి ఆవేదన అర్థం చేసుకొని బాధితుల తరఫున మాట్లాడడానికి ప్రయత్నాలు చేయండి. కాని సాక్షిలో వచ్చిన చిన్న కథనాన్ని పట్టుకొని లాగకండి అని సూచించారు. కెసిఆర్ ధర్నా చేసినప్పుడు కేకే, విహెచ్ లు రాద్దాంతం చేశారన్నారు. ఆంగ్ సాన్ సూకీ పదేళ్లుగా లిక్విడ్ తీసుకొని నిరాహార దీక్ష చేసిందని, ఇప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉందని కేసిఆర్ వారం పది రోజులు దీక్ష చేయగానే కెకె, విహెచ్ లు సోనియాగాంధీ వద్ద రాద్దాంతం చేశారని విమర్శించారు.