వైయస్ జగన్ ఇష్యూ: రాజీనామాస్త్రంతో రేపు ఢిల్లీకి రోశయ్య

ముఖ్యమంత్రి రోశయ్య అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పోస్టుల భర్తీకి తనకు స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. తాను రాజీనామా చేస్తే శాంతిస్తారా అని రోశయ్య సోమవారం పుట్టపర్తిలో అనడం అందులో భాగమేనని అంటున్నారు. రోశయ్యను అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.
మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని ఇంతకు ముందు నాలుగైదు సార్లు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే అధిష్టానం అందుకు అంగీకరించలేదు. తనకు స్వేచ్ఛ ఇవ్వకుండా వైయస్ జగన్ వ్యవహారాలను కట్టడి చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వ్యవహారం పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో రోశయ్య ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైయస్ జగన్ పై చర్యలు తీసుకునే విషయంపై రోశయ్యతో అధిష్టానం పెద్దలు చర్చించే అవకాశం ఉంది. అలాగే, మంత్రివర్గ విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications