వైయస్ జగన్ అందరిలాగే ఓ ఎంపి: కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాజకీయ జేఏసీ వాళ్లు తమ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదంటున్నారు కదా అన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ''కేబినెట్లో ఎవరుండాలి అన్నది నిర్ణయించేది జేఏసీ కాదు. అది మా అధిష్ఠానం నిర్ణయిస్తుంది. మేం పార్టీ హైకమాండ్ ప్రకారమే వెళ్తాం. వేరే వాళ్లు చెప్పినట్లు కాంగ్రెస్పార్టీ నడుచుకోదు'' అని అన్నారు. ''కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారు. ఏ ప్రాంతం వారైనా అధిష్ఠానం చెప్పింది కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. పాటిస్తాం కూడా'' అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినప్పుడు అది కూడా కసరత్తులో భాగమేనని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రస్తుతం జగన్ నుంచి తిరుగుబాటును ఎదుర్కొంటోంది... ఆ సవాల్ను ఎలా అధిగమిస్తారు అని అడిగినప్పుడు ''జగన్మోహన్రెడ్డి ఒక కాంగ్రెస్ ఎంపీ. మేం మిగతా కాంగ్రెస్ ఎంపీలందరినీ ఎలా చూస్తున్నామో ఆయన్నూ అలాగే చూస్తాం. మేం కాంగ్రెస్ ఎంపీలందరి సహకారం తీసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం'' అని చెప్పారు. జగన్పై చర్య తీసుకునేందుకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశమైందికదా... దానిపై ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ ''క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సింది ముఖ్యమంత్రికాదు. అది పార్టీ తీసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు ఆయన ఒక కాంగ్రెస్ ఎంపీ. మా మంచి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి కుమారుడు. ఆయన 30 ఏళ్లు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు. మేం అంతా ఐక్యంగానే ఉండి అత్యుత్తమ పనితీరు కనబరచడానికి ప్రయత్నిస్తాం'' అని అన్నారు. జగన్పై చర్య తీసుకోడానికి హైకమాండ్ భయపడుతోందా అని అడిగినప్పుడు 'ధన్యవాదాలు' అంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications