పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య: సలహాదారుగా కెఆర్ సురేష్ రెడ్డి?
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి దామోదరం రాజనర్సింహకు, ఆంధ్ర నుంచి బొత్స సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమకు చెందినవాడు కావడంతో మిగతా రెండు ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతున్నట్లు తెలుస్తోంది. కాగా, శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకునే అవకాశం ఉంది. కెఆర్ సురేష్ రెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం వద్ద తీవ్ర ప్రయత్నం చేశారు. ఆయన శాసనసభ్యుడు గానీ, ఎమ్మెల్సీ గానీ కాకపోవడంతో అధిష్టానం అందుకు అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వ సలహాదారుగా ఆయనను నియమించుకుంటారని తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారులంతా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, శాసనసభ స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. పది మందితోనే రేపు కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గాన్ని రేపు ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. కొత్త మంత్రులు రేపు ఉదయం 10 గంటల 13 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. మంత్రులుగా ఎరాసు ప్రతాపరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, రఘువీరా రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి.