తెలంగాణకు మేం ఏం చేయలేక పోతున్నామనే దీక్ష: కేశవరావు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిఅన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి లేదా ఒత్తిడి తీసుకు వచ్చి తప్పకుండా తెలంగాణ సాధిస్తామని చెప్పారు. తెలంగాణతో పాటు తమకు పార్టీ కూడా ముఖ్యమని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్టీని కాపాడుకుంటూ తెలంగాణ సాధిస్తామన్నారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే సమస్య జఠిలమయ్యేది కాదన్నారు. తమ దీక్ష పార్టీపై ధిక్కారం కాదని కేవలం ప్రజలకోసమని ఆయన చెప్పారు. మా దీక్షతో ప్రభుత్వానికి ఎలాంటి ముప్పులేదని చెప్పారు. తెలంగాణ సాధనే తమ ఆఖరి లక్ష్యమని సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాగా గన్ పార్కు వద్ద పోలీసులు దీక్షకు అనుమతించకపోతే ర్యాలీగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సుకు వెళ్లి అక్కడ దీక్షను కొనసాగిస్తారు.
ప్రభుత్వంపై నైతికంగా ఒత్తిడి పెంచడానికే ఈ దీక్షను చేపట్టామని మరో సీనియర్ నాయకుడు కె కేశవరావు అన్నారు. విద్యార్థుల వద్దకు వెళ్లి మేం ఉన్నామని చెప్పిన మేము, ప్రజల వద్దకు వెళ్లి మేం తెలంగాణ తీసుకు వస్తామని చెప్పిన మేము, ప్రభుత్వం మాది అని చెప్పిన మేము ఏం చేయలేక పోతున్నామనే బాధతో ఉన్నామని, అందుకే మేం దీక్షకు పూనుకున్నామన్నారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు అన్నీ ఎత్తివేయాలని చెప్పారు. ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని అన్నారు.