అనైతికతను చిదంబరం ఆహ్వానం ప్రోత్సాహం: కెటి రామారావు
ఎంబిఎ మార్గదర్శక సూత్రాలను పాటించాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికా సోనీ ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక ప్రైవేట్ సంస్థ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను పాటించాలని సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. మీడియాతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రాంతీయ ఉద్వేగాలతోనే వ్యవహరిస్తున్నాయని, మీడియా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ స్థితిలో మీడియాపై ఆంక్షలకు ఆర్థం లేదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని, ఆ అపనమ్మకంతోనే ఆత్మహత్యలు జరిగాయని, ఈ స్థితిలో పెద్ద యెత్తున బలగాలను మోహరించడం వల్ల అపనమ్మకం మరింతగా పెరుగుతుందని, ముందు జాగ్రత్తగానే బలగాలను మోహరించామని చిదంబరం చెప్పడం సరిపోదని ఆయన అన్నారు. బలగాల మోహరింపుపై చిదంబరం వివరంగా సమాధానం చెప్పాలని, కేంద్ర బలగాలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండడం నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఒక వెసులుబాటును కల్పించుకోవడానికేనని, తెలంగాణ ఏర్పాటు తప్ప మరో విధంగా వెళ్తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజారుతుందని ఆయన అన్నారు.