తెలంగాణ ఇస్తేనే పార్టీ ఉంటుంది: కిరణ్ కుమార్ రెడ్డితో కాంగ్రెసు ఎంపీలు
కేసులు ఎత్తేసినందుకు, తాము చేపట్టిన దీక్షకు సహకారం అందించినందుకు వారుసీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఎంపీలు నేతలు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సీనియర్ నేత కె.కేశవరావు, పంచాయతీరాజ్ మంత్రి కె.జానారెడ్డిలను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్ నివాసంలో వారు మాట్లాడారు. పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి కేసులు ఎత్తేయించడంలో చొరవ తీసుకున్నందుకు డీఎస్కు కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రసాధనకూ పనిచేస్తామని ఎంపీలు అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఎత్తేయడం, తాము చేసిన దీక్ష అంతా డ్రామా అని తెదేపా నేతలు విమర్శించడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించేటపుడు, హైదరాబాద్లో ఎస్సై పరీక్షలు వాయిదా వేయించేందుకు, 14ఎఫ్ క్లాజు రద్దు విషయంలో తాము పోరాడుతున్నపుడు తెదేపా తెలంగాణ నేతలు ఏమయ్యారని నిలదీశారు. తెదేపాకు తమను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు.