సూరి హత్య వెనక ఓ బిగ్ షాట్: భానుకు ఆ రోజు వంద కాల్స్?
భాను కిరణ్ మొత్తం 8 సిమ్లను వాడుతాడట. అయితే, సూరి హత్య జరిగిన రోజు వాడిన నెంబర్కు ఓ ప్రముఖ వ్యక్తి నుంచి వంద కాల్స్ వచ్చాయని సమాచారం. ఈ నెంబర్ నుంచి భాను ఆ వ్యక్తికి 60 కాల్స్ చేశాడట. అంతే విరివిగా మెసేజ్లు కూడా పంపాడట. సూరి హత్య జరిగిన రోజు భాను మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో ఉన్నాడని సమాచారం. ఆ తర్వాత మాదాపూర్లోని సైబర్ టవర్ కు వెళ్లాడని చెబుతున్నారు. అనంతరం సూరి, మధుమోహన్ తో కలిసి కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. సూరి హత్య జరిగిన 20 నిమిషాల తర్వాత భాను ఆ ప్రముఖ వ్యక్తికి మెసేజ్ పంపాడని సమాచారం. ఆ తర్వాత ఐదు నిమిషాలకు మరో మెసేజ్ పంపాడని తెలుస్తోంది. సూరి ఫినిష్ అనేది ఆ మెసేజ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. సూరి హత్య తర్వాత చాలా సేపు భాను యూసుఫ్ గుడాలోనూ బంజారాహిల్స్ లోనూ సంచరించాడని చెబుతున్నారు. అందుకే సూరి హత్య యూసుఫ్గుడాలో జరగగా మరో చోట జరిగినట్లు ప్రచారం సాగించారని చెబుతున్నారు.
హత్య తర్వాత చాలాసేపు అక్కడక్కడే సంచరించిన భాను కిరణ్ కూకట్ పల్లి వెళ్లాడని చెబుతున్నారు. అప్పటి నుంచి భాను కిరణ్ ఫోన్ పనిచేయడం మానేసిందని చెబుతున్నారు. అయితే, భాను కూకట్ పల్లి పోలీసులకు లొంగిపోవడమో, పోలీసులు అతన్ని పట్టుకోవడమే జరిగిందని ప్రచారం సాగుతోంది. ఆ సమయంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు కూకట్ పల్లి పోలీసు స్టేషన్ కు రావడంతో ఆ ప్రచారం మరింత ముమ్మరమైంది. అయితే, రొటీన్ తనిఖీల్లో భాగంగానే తాను ఇక్కడికి వచ్చానని, భాను తమ వద్ద లేడని తిరుమలరావు చెప్పారు. ఇప్పుడు భాను కిరణ్ ఎక్కడున్నాడనేది పెద్ద ప్రశ్న.