గవర్నర్ నరసింహన్ పైనే ఆధారపడిన కాంగ్రెసు హైకమాండ్
నివేదికపై వివిధ పార్టీలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం ముందు ఇందుకోసం ప్రత్యేక గడువేమీలేదని, వచ్చేనెల చివర్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, అప్పటికల్లా ఒక నిర్ణయానికి రావచ్చని నేతలు భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను విడుదల చేసిన సందర్భంగా తలెత్తే పరిణామాలపై చర్చించేందుకు రాష్ట్ర గవర్నర్ ఎల్.నరసింహన్ కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆంధప్రదేశ్ వ్యవహారాల గురించి, శాంతిభద్రతల గురించి చర్చించేందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన 30 నిమిషాలపాటు సమావేశమయ్యారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులైన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీతో కూడా ఆయన భేటీ అయ్యారు. ప్రధాని మన్మోహన్సింగ్తో ఆయన శనివారం మధ్యాహ్నం తర్వాత భేటీ అవుతారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరంలతో ఆయన గురువారం రాత్రి సమావేశమయ్యారు.