తెలంగాణ యాసకు నష్టం: పాలకుల తీరుపై శ్రీకృష్ణ నివేదిక
విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ యాసకు చోటు లేకపోవటంతో తెలంగాణ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని నివేదికలో పేర్కొన్నారు. ఇంట్లో మాట్లాడే భాషకు, పాఠ్య పుస్తకాల్లోని భాషకు తేడా ఉండటం అక్కడి విద్యార్థులకు కష్టం కలిగించింది. తద్వారా వారిలో అసంతృప్తి గూడు కట్టుకుపోయిందని తద్వారా తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటే అనే భావనను తెలంగాణ ప్రజలకు దూరం చేశారని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోను, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ యాసకు పరిహాసించడం వల్ల తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఇకముందు కూడా తెలంగాణ భాషకు ప్రాధాన్యం లభించదనే భావన తెలంగాణ ప్రజల్లో పుట్టుకు వచ్చిందన్నారు.
తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర యాసలు వేరువేరుగా ఉంటాయని ఆయా ప్రాంతాల కవుల రచనలు చూస్తే కూడా తెలుస్తుందని వారు తమ నివేదికలో పొందుపర్చారు. కోస్తాంధ్ర తెలంగాణలో, తెలంగాణ తెలుగులో వ్యత్యాసం స్పష్టంగా ఉందన్నారు. పాలనలో కోస్తాంధ్రలోని తెలుగును ప్రామాణికంగా తీసుకున్నారన్నారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ మాండలికాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. పాలకుల చర్యలు తెలుగు వారంతా ఒక్కటి కాదన్న భావన తెలంగాణ ప్రజల్లో తలెత్తడానికి కారణమైందని చెప్పారు. అయితే మాండలికం ప్రాతిపదికన తెలుగు జాతిని విభజించడం మాత్రం సరికాదని వారు ఆ నివేదికలో పొందుపర్చారు.