నాగం జనార్దన్ రెడ్డికి పొగ పెట్టింది చంద్రబాబు నాయుడేనా?
నాగం జనార్దన్ రెడ్డిపై మోత్కుపల్లి నరసింహులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనక చంద్రబాబు హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా దేవేందర్ గౌడ్ను ప్రయోగిస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. అయితే, దేవేందర్ గౌడ్ చేస్తున్న విమర్శలకు, చేస్తున్న వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుల నుంచి తీవ్రమైన ఎదురుదాడి వస్తోంది.
దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయి నవ తెలంగాణ పార్టీని స్థాపించిన సమయంలో చంద్రబాబుపై చేసిన విమర్శలను, తీవ్ర వ్యాఖ్యలను తిరగదోడుతున్నారు. ఇది దేవేందర్ గౌడ్ను ఇరకాటంలో పెడుతోంది. పైగా, తెలంగాణ ప్రజలు దేవేందర్ గౌడ్ను నమ్మే పరిస్థితి పోయింది. ఈ స్థితిలో మోత్కుపల్లి నరసింహులును చంద్రబాబు ప్రయోగించినట్లు చెబుతున్నారు.
నర్సింహులు తెలంగాణ విషయంలో ఇప్పటి వరకు వ్యతిరేక వ్యాఖ్యల చేయకపోవడం, దళిత నాయకుడు కావడం నాగంపై ఎదురు దాడికి బాగా ఉపకరిస్తుందని చంద్రబాబు భావించినట్లు చెబుతున్నారు. గతంలో దేవేందర్ గౌడ్కు వ్యతిరేకంగా నాగం జనార్దన్ రెడ్డిని ప్రోత్సహించినట్లు ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా మోత్కుపల్లిని చంద్రబాబు ప్రయోగిస్తున్నారని అంటున్నారు.
కాగా, మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించడానికి నాగం జనార్దన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. ప్రత్యేక శాఖపై చంద్రబాబు స్పందన కోసం వేచి చూద్దామని నాగం జనార్దన్ రెడ్డి పార్టీ తెలంగాణ నాయకులకు చెబుతున్నారు తెలంగాణ విషయంలో మిగతా పార్టీలు ఉద్యమిస్తున్నాయని, ఈ విషయంలో తమ పార్టీ వెనకపడిపోకూడదనే తన ఆరాటమని ఆయన చెబుతున్నారు.