జయసుధ తెలంగాణ ప్రకటన వెనక వైయస్ జగన్ వ్యూహం?

ఇందులో భాగంగానే జయసుధ తెలంగాణ అనుకూల ప్రకటన చేశారని చెబుతున్నారు. జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ తాను తెలంగాణ కోసం పోరాడుతానని అంటున్నారు. గోనె ప్రకాశ రావు, బాజీరెడ్డి గోవర్దన్ వంటి నాయకులు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొండా సురేఖ వంటి నాయకులు ప్రజల ఒత్తిడి వల్లనే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, వారెన్ని మాటలు చెప్పినా జగన్ సమైక్యవాదమే అందుకుంటారని భావిస్తున్నారు. ఈ భావన సరి కాదని చెప్పడానికి సమైక్యవాదిగా ఉన్న జయసుధతో జగన్ తెలంగాణ అనుకూల ప్రకటన చేయించారని అంటున్నారు.
కాంగ్రెసు అధిష్టానం సమైక్యవాదం వైపే మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రజల ఆదరణ పొందడానికి అంతకు మించిన మార్గం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ నేతలు తెలంగాణవాదాన్ని వినిపించడం వల్ల లాభమై గాని నష్టం జరగదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు చూసుకోవచ్చునని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
సీమాంధ్రలో తన హవాను చూపుతూ తెలంగాణలో చాలా మటుకు వ్యతిరేకతను తగ్గించుకోవడానికి తన వర్గానికి చెందిన నేతలతో తెలంగాణ అనుకూల ప్రకటనలు చేయించాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాదిరిగానే తెలంగాణ నాయకులు తెలంగాణవాదాన్ని వినిపించడం వల్ల ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం చిక్కుతుందని వైయస్ జగన్ భావిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications