వైయస్ జగన్ దూకుడును చూసే అవిశ్వాసంపై చంద్రబాబు వెనక్కి
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ పావులు కదిపితే మధ్యంతర ఎన్నికలు రావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా మధ్యంతర ఎన్నికలనే కోరుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు. ప్రభుత్వం పడిపోయి మధ్యంతరం వస్తే ఎవరికి లాభం కలుగుతుందనే అంచనాలకు వచ్చే చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గడంతో తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టే చర్యలకు వైయస్ జగన్ వర్గం పూనుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని విమర్శిస్తోంది. గతంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామంటూ గంతులేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు వెనక్కి తగ్గడం వల్ల జగన్ వర్గం విమర్శలు ప్రజల్లో అనుమానాలకు తావిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డితో, చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెరాస నాయకులు కూడా విమర్శిస్తున్నారు. తెరాస నాయకుల వాదన వల్ల జగన్ వర్గానికి మరింత బలం చేకూరుతుంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తలో చేయి వేయడానికి తెరాస, జగన్ వర్గం సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.
అయితే, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉందని అంటున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే సానుభూతితో సీమాంధ్రలో వైయస్ జగన్ లాభపడవచ్చునని, జగన్ కాంగ్రెసు ఓట్లనే చీలుస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ తమకు కూడా ఏదో మేరకు నష్టం జరగవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వచ్చిన చిరంజీవి కాంగ్రెసుకు ప్లస్ పాయింట్ కావచ్చునని అనుకుంటున్నారు.
ఇక, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మధ్యంతర ఎన్నికలు వస్తే పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్థితే ఉంది. దీంతో చంద్రబాబు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా లేరని అంటున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే, ఫిబ్రవరిలో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏమైనా జరగవచ్చునని అంటున్నారు.