హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవి హత్యలో వైయస్ జగన్ పాత్ర: ఆంధ్రజ్యోతి వార్తాకథనం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కేసులో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఇదే వార్తాకథనాన్ని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ కూడా ప్రసారం చేసింది. ఎబిఎన్ సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ సిఇవోగా వ్యవహరిస్తున్న స్టూడియోఎన్ టీవీ చానెల్ కూడా ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. స్టూడియో ఎన్ అదనంగా జగన్ ప్రత్యర్థి పార్థసారథి రెడ్డితో మాట్లాడించింది. కాగా, పరిటాల రవి హత్య కేసులో దర్యాప్తు చేసిన సిబిఐ మంగలి కృష్ణను విచారించినప్పటికీ అతని వాంగ్మూలాన్ని రికార్డు చేయలేదని, వైయస్ జగన్‌ను కూడా సిబిఐ విచారించిందని ఆంధ్రజ్యోతి వార్తాకథనం తెలిపింది. జగన్‌కు పరిటాల రవి హత్య కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, సిబిఐ పరిటాల రవి హత్య కేసులో - పరిటాల హత్యకు జగన్ ఆశీస్సులతో మంగలి కృష్ణ ఆర్థిక సహకారం అందించాడని సిబిఐ రాసి పెట్టుకుందని ఆంధ్రజ్యోతి తెలిపింది. దీని ఆధారంగా పరిటాల రవి హత్యలో జగన్ పాత్రపై ఆంధ్రజ్యోతి అనుమానాలు వ్యక్తం చేసింది.

సిబిఐ వద్ద ఉన్న సమాచారం ఇదీ అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి - పరిటాల హత్య కేసులో దాదాపు 3 నెలలు దర్యాప్తు జరిపిన అనంతరం సీబీఐ మంగలి కృష్ణ పాత్రపై నోట్ తయారు చేసింది. దీని ప్రకారం... 2001లో పరిటాల రవిని చంపేందుకు పెట్టిన సూట్ కేసు బాంబు కేసులోనూ కృష్ణ ప్రమేయం ఉంది. దీనిపై కన్ఫెషన్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే... పులివెందులకు చెందిన కృష్ణ, వైఎస్ జగన్‌కు కుడిభుజం! జగన్ అప్పటికే తన తాత రాజా రెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. రాజారెడ్డిని చంపినట్లు భావిస్తున్న పార్థసారథి రెడ్డిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ పని చేసి పెట్టేందుకు కృష్ణ అప్పట్లో సూరిని సంప్రదించాడు.

ఇంకా ఇలా ఉంది - సూరితోపాటు చిన్న సుదర్శన్, రెడ్‌స్టార్‌కు చెందిన మల్లకాలువ రామ్మోహన్ రెడ్డితోనూ చర్చలు జరుపుతున్నారు. అయితే... తొలుత పరిటాలను చంపాలని, ఆ తర్వాత పార్థసారథి రెడ్డిని చంపేయవచ్చని కృష్ణ ద్వారా ఒప్పం దం కుదుర్చుకున్నాడు. దీంతో... కృష్ణ జగన్ ఆశీస్సులతో పరిటాల హత్యకు ఆర్థిక సహాయం చేశాడు. జూలకంటి శ్రీనివాస రెడ్డి (మొద్దు శీను) ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పరిటాల కేసులో వైఎస్‌తోపాటు మిగిలిన వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చాడు. కృష్ణ మద్దతుతోనే ఆ ఇంటర్వూ ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణను ప్రశ్నిస్తే... కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడతాయని సీబీఐ ఎస్పీ తన నోట్‌లో తయారు చేసుకున్నారు.

సాక్షిగా హాజరైన మంగలి కృష్ణ వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేయకపోవడాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక తన వార్తాకథనంలో తప్పు పట్టింది. మంగలి కృష్ణ ఏం చెప్పాడనేది రహస్యంగానే మిగిలిందని వ్యాఖ్యానించింది. కాగా, సూరని హత్య చేయించింది కూడా వైయస్ జగనే అని పార్థసారథి రెడ్డి స్టూడియోఎన్ ఇంటర్వ్యూలో ఆరోపించారు. భానును కూడా చంపేసి ఉంటారని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X