సోనియా గాంధీ దిగిపోవాలి: చిరు ఇంటికి ఆంటోనీ రావడంపై కాకా
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందనే నమ్మకం లేకుండా పోయిందని, ఎన్నిసార్లు అడిగినా సోనియా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆంటోనీ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లేంతగా కాంగ్రెసు దిగజారిపోయిందని ఆయన అన్నారు. చిరంజీవిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడవచ్చు కదా, 125 ఏళ్ల పార్టీకి ఈ గతి పట్టడమేమిటని ఆయన అన్నారు. ఈ చర్యకు పార్టీ సీనియర్ నేతలంగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యంతో పొత్తుపై అధిష్టానం ఇంతగా తొందరపడాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు. బుద్ధి లేకుండా కాంగ్రెసును నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓసారి ఓడిపోతే ఓడిపోతాం, ఇందిరా గాంధీ హయాంలో కూడా ఓడిపోయామని, కానీ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బిక్షమడిగి చిరంజీవి బతిలాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఇద్దరు, ముగ్గురు పిల్లలతో ఎఐసిసి నడుస్తుందా, గ్రామగ్రామాన తిరిగి కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకున్న నాయకులతో మాట్లాడాల్సి ఉండిందని, వారి సలహాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. చిరంజీవితో పొత్తు అంతా ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పరిస్థితి తలుచుకుంటే సిగ్గు పోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు ఇంతకు ముందు దక్షిణలు ఇచ్చేవారని ఆయన అన్నారు. దక్షిణలు వైయస్ రాజశేఖర రెడ్డి ఇచ్చేవారా అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాడిన చిరంజీవితో స్నేహం చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.