చిరంజీవికి వైయస్ జగన్తో పోలికే లేదు: పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్
తెలంగాణకు చిరంజీవితో స్నేహానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ మంత్రివర్గంలో చేరుతుందా, కాంగ్రెసులో విలీనమవుతుందా అనేది తనకు తెలియదని, చిరంజీవితో స్నేహంపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుందని, దీనికి పార్టీ నాయకులంతా కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కూడా పార్టీ అధిష్టానమే పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. చిరంజీవితో స్నేహం రాజకీయ వ్యూహంలో భాగమని ఆయన అన్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు ఇతరులకు లేదని ఆయన అన్నారు.
చిరంజీవితో దోస్తీపై దాపరికం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఎన్నికల్లో 18 శాతం ఓట్లు వచ్చిన ఓ పార్టీ అధ్యక్షుడితో తమ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు మాట్లాడడంలో తప్పు లేదని ఆయన చిరంజీవితో ఎకె ఆంటోనీ భేటీపై వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ పెద్ద మనిషి ద్వారా చిరంజీవికి ఆహ్వానం పంపారని ఆయన చెప్పారు. చిరంజీవితో ఆంటోనీ భేటీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసునని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన చెప్పారు.