బాధితులే లేనప్పుడు రేప్ కేసు ఎలా పెడతారు?: స్వామి నిత్యానంద
డబ్బు కోసం తనను బడా రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, తన నుంచి రూ. 100 కోట్లు వారు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అస్సలు ఎఫ్ఐర్ పత్రంలో బాధితుల పేర్లు లేవని, అలాంటప్పుడు తనపై అత్యాచారం కేసు ఎలా నమోదవుతుందని ఓ విలేఖరి అడిగన ప్రశ్నకు నిత్యానంద సమాధానమిచ్చారు. రంజితతో శృంగారం జరిపినట్లు చూపిస్తున్న వీడియో మార్ఫింగ్ చేయబడిందని మరోసారి నిత్యానంద పునరుద్ఘాటించారు. ఆ వీడియో ఫుటేజ్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు కొట్లామంది తన భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన చెప్పారు.
తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఈ మార్ఫింగ్ వీడియోను సృష్టించారని, తనను బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తులు వివరాలు, సాక్ష్యాలతో సహా తన వద్ద ఉన్నాయని నిత్యానంద చెప్పారు. తనను రూ. 60 కోట్ల రూపాయల నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారని, అందుకు దానికి తాను అంగీకరించకపోవడంతో మార్ఫింగ్ చేసిన వీడియో ఒకేసారి 1,700 కంప్యూటర్ల నుంచి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారని ఆయన చెప్పారు. ప్రసిద్ధులను అప్రతిష్టపాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
ఫలితంగా సదరు వీడియో పలు ప్రసార మధ్యామల్లో ప్రచారమై తన ప్రతిష్టకు అపార నష్టాన్ని మిగిల్చిందని నిత్యానంద మీడియాతో చెప్పారు. హిందూత్వ విధానాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా తనపై వచ్చిన మచ్చలను మాపుకునేందుకు కన్యాకుమారి నుంచి బీదర్కు 21 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో తన భక్తులు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొనాలని నిత్యానంద పిలుపునిచ్చారు.