చిరంజీవి రాకతో కాంగ్రెసులో ఉత్సాహం, కలిసి పని చేస్తానన్న కిరణ్
చిరంజీవికి సముచిత స్థానం కల్పించేందుకు అధిష్ఠానం ఆలోచిస్తుందని అన్నారు. చిరంజీవికి నటుడిగా ఎంతో గుర్తింపు పొందారని రాజకీయంగా కూడా గుర్తింపు సాధించారని అన్నారు. రెండు పెద్ద పార్టీలను ఢీకొని 18 శాతం ఓట్లు సాధించడం సామాన్యమైన విషయం కాదని గుర్తించాలన్నారు. సామాజిక న్యాయం సాధనకు ఒక్కడే పోరాడితే సరిపోదని జాతీయ పార్టీలో విలీనం ద్వారా అది మరింత సులువు అవుతుందని గుర్తించారని, ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపుడే దీనికి ప్రతిపాదించామని అయితే అది ఆచరణలోకి రాలేదని, దీంతో కలసి పోటీ చేశామన్నారు.
సమైక్యవాది అయిన చిరంజీవి కాంగ్రెస్లో చేరడంతో తెలంగాణ అంశం వెనుకబడుతుందే అంశంపై స్పందిస్తూ సమైక్యవాదులు కాంగ్రెస్లోనూ ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం యూపీఏ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే చెప్పారని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అన్నారు. మాజీ ఎంపీ జగన్ వల్ల ఏర్పడిన లోటు వల్లే చిరంజీవిని చేర్చుకున్నారనే అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్కు ఏ లోటూ లేదని కాంగ్రెస్ బలంగానే ఉందని, చిరంజీవి రాకతో అదనపు బలం చేరుతుందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆంటోని ఇటీవల చిరంజీవి ఇంటికి రావడంపై కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ 'ఆయన చాలా పెద్దవారు ఆయన మాటలపై నేను మాట్లాడేది లేదు' అని అన్నారు. ఎవర్నీ లక్ష్యంగా పెట్టుకుని తాము వ్యవహరించడంలేదన్నారు. కాంగ్రెస్లో ప్రజాకర్షణ కలవారు చాలామంది ఉన్నారని కాంగ్రెస్ పార్టీనే గొప్ప ప్రజాకర్షణ కలపార్టీ అని గుర్తించాలన్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్వాగతించారు. విలీనానికి అనుమతించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విలీనం కోసం నిర్ణయం తీసుకున్న ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను అభినందించారు. ఆ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చిరంజీవి, తాను కలిసి సమగ్రాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. విలీనం వల్ల రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.