ఢిల్లీకి డి. శ్రీనివాస్: ఇక వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు

వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలకు తగిన చర్యలను సోనియా సూచన మేరకు డిఎస్ చేపడతారని అంటున్నారు. దీనిపై చర్చకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అందువల్లనే వీలైతే వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖను వెనక్కి రప్పించే ప్రయత్నం ఆయన చేసినట్లు చెబుతున్నారు. అవసరమైతే కొండా సురేఖపై చర్యలు తీసుకోవడాన్ని వాయిదా వేసి, జగన్ వెంట వెళ్తున్న కొద్ది మందిపై చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. సురేఖ వైయస్ జగన్ వర్గం ఒత్తిడి వల్లనే తిరిగి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, చిరంజీవిపై ధ్వజమెత్తినట్లు చెబుతున్నారు. ఆమె కాంగ్రెసు పట్ల, సోనియా పట్ల కాస్తా మెత్తబడినట్లు, అందుకు అనుగుణంగానే తన వ్యాఖ్యల్లో వాడిని తగ్గించినట్లు చెబుతున్నారు.
తొలి విడతగా, జగన్ వెంట వెళ్తున్న శ్రీకాంత్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి కొద్ది మంది మీద తొలి విడత చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఈలోగా, జగన్ వెంట వెళ్తున్న మరి కొద్ది మందిని తమ వైపు తిప్పుకోవాలని డిఎస్ ఆలోచన చేస్తున్నారు. ఆ చర్యల ద్వారా పార్టీని గాడిలో పెట్టే పనికి పూనుకుంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications