వైయస్ జగన్ ఆస్తులు జప్తు చేయాలి: హైకోర్టుకు శంకరరావు లేఖ
తన తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రులు, అధికారులను ప్రభావితం చేయడం ద్వారా జగన్ వేల కోట్ల రూపాయలను సంపాదించారని తాజా లేఖలో శంకరరావు మరోసారి హైకోర్టుకు తెలిపినట్లు ఆ పత్రిక రాసింది. 2009లో జగన్ ఎంపీగా ఎన్నికయ్యాక కూడా ఇవి కొనసాగించారని తెలుపుతూ అందువల్ల ప్రజాప్రతినిధిగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8, 9, 13ల కింద ప్రాసిక్యూట్ చేయాలని శంకరరావు హైకోర్టును కోరినట్లు తెలిపింది. జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో ప్రజాధనం ఉందని ఆరోపిస్తూ అందువల్ల సీబీఐ దర్యాప్తు ముగిసేదాకా ఆస్తులను జప్తు చేసేలా ఆదేశించాలని కోరినట్లు వార్తను రాసింది.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 2002లో తన ఆస్తుల విలువ 50 లక్షలకు మించిలేదని అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేస్తూ 2003-04 జగన్మోహన్రెడ్డి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించారని దాని ప్రకారం ఆయనకు రూ.36.53 లక్షలు ఉన్నాయని శంకర రావు అన్నట్లు ఆ పత్రిక రాసింది. 2004-05 వచ్చేసరికి తన ఆదాయాన్ని రూ.6.64 కోట్లుగా, స్థిరాస్తులను 40.92 లక్షలుగా చూపించారని మంత్రి అన్నట్లు రాసింది. 2004 తరువాత జగన్ ఆదాయం ఊహించని రీతిలో పెరిగిందని చెప్పారని, 2004లో 36 కంపెనీలు సృష్టించి, చట్టానికి అందకుండా వివిధ పద్ధతుల్లో అక్రమ ఆర్జన చేశారని మంత్రి శంకరరావు ఆరోపించినట్లు ఆ పత్రిక తెలిపింది.