తెలంగాణలో సహాయ నిరాకరణ: ఆగిన ఎక్కడి పనులు అక్కడే

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జెఎసిల ఆధ్వర్యంలో చేపట్టిన సహాయ నిరాకరణ వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. గురువారం ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. తెలంగాణవాదులు పలుచోట్ల ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోకుండా ప్రయాణించారు. పదిజిల్లాల్లో జనగణన విధులను బహిష్కరించినట్లు ఉపాధ్యాయ జెఎసి వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో సహాయ నిరాకరణలో భాగంగా ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో పనులు స్తంభించి పోయాయి. బంద్‌ వాతావరణం కన్పించింది. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఉద్యోగులు సంతకాలు చేసిన అనంతరం విధులను బహిష్కరించారు. ర్యాలీలు నిర్వహించి, ధర్నా చేశారు. సచివాలయంలోకి వస్తున్న మంత్రులను అడ్డుకునేందుకు యత్నించారు.

జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు ఉద్యోగులు హాజరు కాకుండా తెలంగాణవాదులు తాళాలు వేశారు. బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణలో మీడియా సిబ్బంది గాయపడ్డారు. ఓయూ ప్రధాన ద్వారం సమీపంలోని హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌ను తెలంగాణవాదులు ముట్టడించి, ఆంధ్రా వస్తువులు కొనవద్దంటూ నినాదాలు చేయడంతో అంబర్‌పేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ గురువారం ఖైరతాబాద్‌ నుంచి అసెంబ్లీ వరకు బస్సులో టికెట్‌ లేకుండా ప్రయాణించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ హిమాయత్‌నగర్‌ నుంచి సోమాజిగూడా వరకు టికెట్‌ తీసుకోకుండా ప్రయాణం చేశారు.

వరంగల్‌ జిల్లాలో సహాయ నిరాకరణ మొదటిరోజు సంపూర్ణంగా సాగింది. కలెక్టరేట్‌ సిబ్బంది విధులు బహిష్కరించి ఆటాపాటా, ధూంధాం నిర్వహించారు. డీఆర్వో కారాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఐకాస నాయకులు ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ లేకుండా ప్రయాణించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మధిర, సత్తుపల్లి, మణుగూరు, భద్రాచలం తదితర పట్టణ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. నల్గొండ కలెక్టరేట్‌లోని ప్రభుత్వ శాఖలతో పాటు జిల్లాలోని డివిజన్‌, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు విధులు నిర్వహించలేదు. జిల్లా కేంద్రంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. టికెట్లు తీసుకోకపోవడంతో బస్సుల్లో కండక్టర్‌, ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సహాయ నిరాకరణతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిపాలన, రవాణా వ్యవస్థ స్తంభించిపోయాయి. కలెక్టరేటు బోసిపోయింది. ఎనిమిది బస్సు డిపోల్లోనూ బస్సులు అరకొరగానే నడిచాయి. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఆందోళనకారులు విజిలెన్స్‌ సిబ్బంది వసూలు చేసిన బకాయిల్ని తిరిగి ఇచ్చేసేదాకా పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. బొంరాస్‌పేట మండలం ఏర్పుమళ్లలో జనగణన చేస్తున్న ఉద్యోగి నుంచి పత్రాలు లాక్కొని చించేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరు కార్యాలయం సహా జిల్లాలోని పలు కార్యాలయ ఉద్యోగులు కార్యాలయాలకు హాజరైనా, పనులకు దూరంగా ఉన్నారు. సింగరేణి కార్మికులు గంటపాటు టూల్‌డౌన్‌ సమ్మెలో పాల్గొన్నారు. నిర్మల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు రికార్డులు, హాల్‌టిక్కెట్లను దహనం చేసి పరీక్షలను బహిష్కరించారు.

నిజామాబాద్‌ జిల్లాలో జిల్లాస్థాయి అధికారులు మినహా ఉద్యోగులెవరూ విధులు నిర్వర్తించలేదు. తెలంగాణవాదులు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు లేకుండా ప్రయాణించారు. నిజామాబాద్‌లో ఆర్టీసీ రీజినల్‌ మేనేజరు కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌ కార్యాలయానికి ఉద్యోగులు తాళం వేశారు. కరీంనగర్‌ జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సంతకాలు చేసి విధులను బహిష్కరించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో అన్ని విభాగాలు బోసిపోయాయి. మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డిలో వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరేట్‌కు చేరుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్‌ వద్ద రుసుము చెల్లించకుండా అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+