తెలంగాణపై లోకసభలో కెసిఆర్ వ్యూహం ఏమిటి?
కెసిఆర్ వాయిదా తీర్మానానికి మద్దతిస్తామని బిజెపి నాయకుడు ప్రకాష్ జవదేకర్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, బిజెపి కూడా రేపు తెలంగాణపై ఓ తీర్మానాన్ని ప్రతిపాదించబోతోంది. రెండు తీర్మానాలపై ఎన్డిఎ పక్షాలు కలిసికట్టుగా వ్యవహరించడానికి అనువైన వ్యూహం రూపొందుతున్నట్లు సమాచారం.
తనకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తాను కూడా కలిశారు. అయితే, కెసిఆర్ తీర్మానానికి తాము ఎందుకు మద్దతివ్వాలని సిపిఐ నాయకుడు డి. రాజా ఇప్పటికే ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ జెడి(యు) నేత శరద్ యాదవ్తో కూడా భేటీ అయ్యారు.
శరద్ యాదవ్ కెసిఆర్కు మద్దతిస్తామని హామీ ఇచ్చారు. కాగా, రేపు వాయిదా తీర్మానంపై ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రతిస్పందించకపోతే స్పీకర్ పోడియం వద్ద బైఠాయిస్తానని కెసిఆర్ చెప్పారు. ఆయనతో పాటు తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కూడా పోడియం వద్ద బైఠాయించే అవకాశాలున్నాయి. మొత్తం మీద, ప్రభుత్వ ఎజెండాలోకి తెలంగాణ అంశాన్ని తెచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.