తెలంగాణ ఎంపీలకు కావూరి సాంబశివ రావు కౌంటర్ వ్యూహం
శ్రీకృష్ణ కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ పెద్దలందరినీ కలిసి ఇదే విషయాన్ని చెప్పాలని, ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తేవాలని ఎంపీలు నిర్ణయించారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో ఈ పనిని పూర్తిచేస్తారని తెలుస్తోంది. సమావేశం అనంతరం ఎంపీ కావూరి సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణ కమిటీ నిజాయితీగా ఇచ్చిన నివేదికను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని, దీనిపై జాప్యం తగదని అన్నారు.
ఆలస్యమైతే రాష్ట్రానికీ, ప్రజలకూ నష్టం జరుగుతుందని అన్నారు. జాప్యం వల్ల అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య విభేదాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ప్రధాని, ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్లను కలిసి విషయాన్ని వివరిస్తామని శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే సముచిత నిర్ణయానికి తమ ఆమోదం ఉంటుందని ఆయన అన్నారు. సమావేశానికి 13 మంది ఎంపీలు హాజరయ్యారని, రానివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారని, అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.