జెసి దివాకర్ రెడ్డికి బహిష్కరణపై నన్ను అడిగే ధైర్యం లేదు: చంద్రబాబు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం శాసనసభ సమావేశాలను బహిష్కరిద్దామని తనను అడిగినట్లు కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. సమైక్యాంధ్రపై శాసనసభా సమావేశాలను బహిష్కరిద్దామని అడిగే ధైర్యం జెసి దివాకర్ రెడ్డికి గానీ కాంగ్రెసు శాసనసభ్యులకు గానీ లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సభలో తమ పార్టీ సభ్యులు తాను చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు ప్రాంతాలూ సమానమేనని, శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్యలు తీసుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారుర. ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించినప్పటికీ అసెంబ్లీలో మాత్రం తన మార్గదర్శకం మేరకే నడుచుకోవాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి గ్రామంలో పోలీసు కాల్పులపై ఆయన ప్రభుత్వం మీద మండిపడ్డారు. కాకరాపల్లి ఘటనపై ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన అవసరముందని ఆయన అన్నారు. స్థానికులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు. కాల్పుల ఘటన తనను చాలా బాధించిందని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకుండా పోలీసులను పెట్టి ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. సోంపేట, కాకరాపల్లి ఘటనలు చూస్తే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. కాకరాపల్లిలో పరిస్థితి సమీక్షించేందుకు బుధవారం శ్రీకాకుళం జిల్లా వెళ్తున్నట్లు చెప్పారు. తమకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఆందోళనకు దిగినట్లు ఆయన తెలిపారు.
TDP president N Chandrababu condemned Congress Seemandhra MLA JC Diwakar Reddy's proposal to boycott assembly for united Andhra. He said that JC has no courage to ask him on this issue.
Story first published: Tuesday, March 1, 2011, 14:46 [IST]