ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ జగన్ వ్యూహం, రంగంలోకి అభ్యర్థులు
బలం ఉన్న చోట పోటీ చేయాలని వైయస్ జగన్ వర్గం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. తొమ్మిది జిల్లాల నుంచి పది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఈ నెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు రంగంలోకి దిగుతున్నారు. అలాగే, నెల్లూరు జిల్లా అభ్యర్థిని కూడా జగన్ వర్గం ఖరారు చేసింది. ఈ రెండు చోట్ల తాము గెలుస్తామనే దీమాతో వైయస్ జగన్ వర్గం ఉంది.
కర్నూలు జిల్లా నుంచి జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి సోదరుడు ఎస్వీ మోహన్ రెడ్డిని పోటీకి దించాలని అనుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆయనను కాంగ్రెసు అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఇక్కడ పోటీ నుంచి విరమించుకోవాలని జగన్ వర్గం భావిస్తోంది. కాగా, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ వైయస్ జగన్ వర్గం చక్రం తిప్పేందుకు సిద్ధపడింది.