డిఎంకె, కాంగ్రెసు సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన, ఢిల్లీకి బాలు
తాను పోటీ చేయదలుచుకున్న నియోజకవర్గాలను కాంగ్రెసు ఎంపిక చేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఏప్రిల్ 13వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి కాంగ్రెసు, డిఎంకె మధ్య మూడు విడతలు చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదరకపోవడంతో ప్రతిష్టంభన చోటు చేసుకుంది. కాంగ్రెసుకు 51 సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ సీట్ల సంఖ్యను 53కు కూడా పెంచడానికి సిద్ధపడింది. అయితే, అకస్మాత్తుగా తనకు కావాల్సిన సీట్ల సంఖ్యను కాంగ్రెసు పెంచేసింది. ఒప్పందం కుదురుతుందని భావించినా గులాం నబీ ఆజాద్ గురువారంనాడు కరుణానిధిని కలసుకోకుండానే ఢిల్లీకి వెళ్లిపోయారు. దీన్ని కరుణానిధి తప్పు పట్టారు.
2006 ఎన్నికల్లో డిఎంకె 132 సీట్లకు, కాంగ్రెసు 48 సీట్లకు, పిఎంకె 31 సీట్లకు, వామపక్షాలు 23 సీట్లకు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ప్రస్తుతం మిత్రపక్షాలకు అంత పెద్దయెత్తున సీట్లను వదిలేస్తే 234 సీట్లున్న శాసనసభలో తమకు పోటీ చేసే స్థానాలు 122 మాత్రమే మిగులుతాయని కరుణానిధి అన్నారు.