సిఎంతో సమావేశం అనంతరం పోటీపై మనసు మార్చుకున్న కందుల!
ఈ నేపథ్యంలో రాజమోహన్ రెడ్డి పోటీకి వెనక్కి తగ్గారు. పోటీపై పునరాలోచించారు. అయితే జిల్లా మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందులను బుజ్జగించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కందుల బ్రదర్స్ భేటీ ఆయ్యారు. ఈ భేటీలో వారితో పాటు జిల్లా మంత్రులు పాల్గొన్నారు. మంత్రుల బుజ్జగింపుతో, సిఎం కిరణ్తో మాట్లాడిన అనంతరం కందుల జగన్పై పోటీకి మళ్లీ సై అన్నారని తెలుస్తోంది. మంత్రుల బుజ్జగింపు కారణంగా కందుల పోటీకి సై అన్నారని, ముఖ్యమంత్రితో ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
అధిష్టానానికి పోటీ చేస్తున్న వారి పేర్లు కూడా పంపించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యంగా కందుల రాజమోహన్ రెడ్డి, తర్వాత వరదరాజులు రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. కందుల కాంగ్రెసులోకి రాకముందు వరదరాజులు రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి పేర్లు వినిపించినప్పటికీ డిఎల్ పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తోంది. టిడిపిలో ఉన్నప్పుడు దివంగత వైయస్తో పోటీ పడి ఆయనను ఓటమికి దగ్గరగా తీసుకు వచ్చిన కందులకు జిల్లాలో మంచి బలం ఉందనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు కందుల వైపు మొగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా కందుల మాత్రం పోటీకి సిద్ధంగా లేరనే వాదన కూడా వినిపిస్తోంది.