గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ జగన్ లింక్స్ కడపలో కాంగ్రెసు అస్త్రం
బ్రాహ్మణి స్టీల్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ చెప్పిన మాటలు బూటకమని కాంగ్రెసు నాయకులు చెప్పనున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే వైయస్ జగన్ ప్రయత్నించారని, ప్రజల కోసం జగన్ ఏ రోజు కూడా పనిచేయలేదని వారు విస్తృతంగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. అలాగే, వైయస్ జగన్ ఏనాటికైనా బిజెపితో కలిసిపోతారని కూడా చెప్పదలుచుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో ఉన్న సంబంధాలతో వైయస్ జగన్ బిజెపి వైపు వెళ్తారని కాంగ్రెసు నాయకులకు ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారు.
కాగా, కడప ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ మహ్మద్ జానీని కాంగ్రెసు పార్టీ అస్త్రంగా వాడనుంది. మైనారిటీ నాయకుడైన తనను ఓడించడానికి వైయస్ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయత్నించారని జానీ కడప ఓటర్లకు చెప్పనున్నారు. కడప పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున జానీ కూడా ప్రచారం చేయనున్నారు. కడప ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయం కోసం ప్రచారం చేస్తారు. అలాగే, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని అంటున్నారు.