వారిది ఆర్బాటం, అలంకరణ: ఆంధ్రా బ్రాహ్మణులపై కెసిఆర్ ధ్వజం
అయితే తాను ఎవరినీ కించపరిచేందుకు కాదంటూనే తెలంగాణ బ్రాహ్మణులు, ఆంధ్రా బ్రాహ్మణులు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. తరతరాలుగా మా కుటుంబం బ్రాహ్మణులతో సాంగత్యం కొనసాగిస్తోంది. వారి సూచనల మేరకు ఏటా పూజలు, హోమాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అశాంతి నుంచి బయట పడేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మే నెలలో గ్రహాల అనుకూలత బాగుంది. తెలంగాణ ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది. 2011లోపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదు అని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదాయ చట్టంలో మార్పులు తెస్తామని, ఆలయాల నిర్వహణ బాధ్యతలను బ్రాహ్మణులకే అప్పగిస్తామని ప్రకటించారు. భారతదేశంలో ఎక్కడా లేని స్థాయిలో హైదరాబాద్లో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు.
దేవాలయంలేని గ్రామం ఉండదు. వేదభూమిగా, కర్మభూమిగా ప్రసిద్ది చెందిన మన దేశంలో అనేక కర్మలు ఉంటాయి. వాటిని ఆచరించడం మన ధర్మం అని కెసిఆర్ అన్నారు. నా చిన్నతనంలో ఉపాధ్యాయుడైన మృత్యుంజయ శర్మ చదువులో నన్ను ఎంతో ప్రోత్సహించారు. సంస్కృతి, సంప్రదాయాలతోపాటు అనేక విషయాలు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఆయన చూపిన మార్గంలోనే నడుచుకుంటున్నాను అని చెప్పారు. యాగం ప్రారంభం నుంచి ముగింపు వరకు కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ అక్కడే ఉన్నారు. కాగా కెసిఆర్ వ్యాఖ్యలపై ఆంధ్రా బ్రాహ్మణులు విరుచుకు పడ్డారు. కెసిఆర్ను భగవంతుడు కూడా క్షమించడని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం హెచ్చరించారు.
చండియాగం ముగింపు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ, సీమాంధ్ర బ్రాహ్మణుల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ పదేళ్లుగా ఎంతోమంది ప్రాణాలు బలితీసుకున్న ఆయన, తన పాపాలు కడిగేసుకునేందుకు బ్రాహ్మణులతో చండియాగం నిర్వహిస్తూనేవారిని దూషించడం హేయమన్నారు. చండియాగం నిర్వహించిన వేద బ్రాహ్మణులలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు.