సత్య సాయి ట్రస్టుపై అంధకారంలో ప్రభుత్వం, రికార్డులు కూడా లేవు
ట్రస్టు కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏ విధమైన రికార్డులు లేవని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. సత్య సాయి చైర్మన్గా ఉన్న ట్రస్టు 1980లో దేవాదాయ శాఖకు నివేదికలను సమర్పించే చట్టబద్దమైన నిబంధనను తమకు మినహాయించాలని కోరినట్లు తెలిస్తోంది. దానికి అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మినహాయింపుతో ట్రస్టు విదేశీ విరాళాలకు సంబంధించిన వివరాలను మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతి ఏడాదీ సమర్పిస్తోంది.
ట్రస్టు ఏర్పడినప్పటి నుంచి వంద శాతం పన్ను రాయితీని అనుభవిస్తూ వస్తోంది. సెంట్రల్ ట్రస్టుతో పాటు సత్య సాయి బాబా వివిధ ట్రస్టులను ఏర్పాటు చేశారు. కర్ణాటక సత్యసాయి హెల్త్ ట్రస్టు, శ్రీసత్య సాయి ట్రస్టు, ముంబై శ్రీ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్టు, అనంతపురం శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, శ్రీ సత్య సాయి మెడికల్ ట్రస్టు, శ్రీ సత్య సాయి ఫౌండేషన్ ఫర్ యూనివర్సల్ పీస్ వంటి ట్రస్టులను ఆయన ఏర్పాటు చేశారు.