టార్గెట్ వైయస్ జగన్! నిప్పులు చెరుగుతున్న చిరంజీవి, చంద్రబాబు
ఓ వైపు కడప జిల్లాలో ప్రచారంలో ఉన్న చిరంజీవి, చంద్రబాబునాయుడు జగన్ అవినీతి సొమ్ముపై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ కారణంగా కడప జిల్లాలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. జగన్ను ఇంటికి పంపిస్తేనే కడపలో ప్రజాస్వామ్యం వెల్లువిరుస్తుందని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇద్దరూ తమ తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. కడప కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా జగన్ వైయస్ కుటుంబంలో చెడ పుట్టారని ఆరోపించారు. ఇక ఇన్నాళ్లు తన మాటలకు పదును పెట్టని టిడిపి అభ్యర్థి ఎంవి మైసూరారెడ్డి ఆదివారం పదును పెట్టారు. జగన్ అక్రమాస్తులపై మైసూరారెడ్డి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.
న్యూఢిల్లీలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏకంగా జగన్కు ఓటేస్తే బిజెపికి ఓటు వేసినట్టే అని అన్నారు. కాంగ్రెసు సీనియర్ సభ్యుడు వి హనుమంతరావు కడప జిల్లాలో ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. గత సాధారణ ఎన్నికలలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణకు వెళ్లాలా అంటూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. విహెచ్ కూడా అదే తరహాలో మాటల తూటాలు పేల్చారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కూడా జగన్పై ఘాటుగానే విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్నదంతా దోచుకున్నావు ఇంకా మాకేమి మిగిల్చావని అన్నారు. పిఆర్పీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు జగన్ వర్గానికి ఏకంగా సవాల్ విసిరినట్టే మాట్లాడారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ చిరంజీవి వద్దకు పంపించిన ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టడానికి తాను సిద్ధమని ప్రకటించారు.
కాగా జగన్ వర్గం దాడి అన్న ఆరోపణలపై ఆ వర్గం నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నందున వారేమీ సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చారు. అయితే జగన్ వర్గం దాడి విషయాన్ని వోటర్లలోకి తీసుకు వెళ్లాలనే భావనతో కాంగ్రెసు, టిడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు.